calender_icon.png 24 October, 2024 | 2:01 PM

ప్రతీకారం తీర్చుకోవాల్సిందే

23-10-2024 12:00:00 AM

నేటి నుంచి జర్మనీతో హాకీ సిరీస్

 న్యూఢిల్లీ: హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ నెగ్గిన భారత పురుషుల జట్టు స్వదేశంలో జర్మనీతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. పది సంవత్సరాల విరామం తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో అం తర్జాతీయ హాకీ మ్యాచ్‌లు నేటి నుంచి జరగనున్నాయి. పారిస్ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన జర్మనీ సెమీస్‌లో భారత్‌ను ఓడించిన సంగతి తెలిసిందే.

ఒలింపిక్స్ ఓటమికి హర్మన్‌ప్రీత్ సేన బదులు తీర్చుకునే సమయం వచ్చేసింది. సిరీస్ ప్రారంభానికి ముందు మీడియాతో సమావేశమైన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ జర్మనీపై ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపాడు.

మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించేందుకు హాకీ ఇండియా అవకాశం కల్పించింది. దీంతో ఇప్పటికే 12వేల మంది అభిమానులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా టెస్టు సిరీస్‌లో భాగంగా నేడు, రేపు మ్యాచ్‌లు జరగనున్నాయి.