calender_icon.png 23 September, 2024 | 10:58 PM

ఉపాధ్యాయులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి.. సీఎంకు హరీశ్‌రావు లేఖ

05-09-2024 12:49:15 PM

హైదరాబాద్: సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ పాఠశాలల నుంచి 6,200 మంది పార్ట్‌టైమ్‌ టీచర్లు, లెక్చరర్లు, డీఈవోలను తొలగించడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. సాంఘిక సంక్షేమ పాఠశాలల నుంచి తొలగించిన సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలను క్లియరెన్స్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున తమ గురువులను సన్మానించుకునే సంబరాల్లో మునిగి తేలాల్సిన విద్యార్థులను రేవంత్ ప్రభుత్వం చదువులు మానేసి ధర్నాలకు దిగేలా చేయడం దురదృష్టకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. తమ గురువులకు మద్దతుగా గురుకుల విద్యార్థులు పిడికిలి బిగించడం అభినందనీయమన్నారు. 

ఐఐటి, ఎన్ఐటి, నీట్ వంటి జాతీయస్థాయి పరీక్షల్లో విద్యార్థులు ర్యాంకులు సాధించేలా వెన్నంటి నిలిచిన గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఉపాధ్యాయులను నిర్దాక్షిణ్యంగా తొలగించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. విద్యా సంవత్సరం మధ్యలో గురుకుల ఉపాధ్యాయులను తొలగించిన మీ నిర్ణయం వల్ల ఈరోజు వేలమంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఉద్యోగాల నుంచి తీసేసిన గురుకుల టీచర్లను తక్షణమే విధుల్లోకి తీసుకుని విద్యార్థుల భవిష్యత్ కాపాడాలని కోరారు. తమ పిల్లల భవిష్యత్తు గురించి కలలుగన్న తల్లిదండ్రులకు ఏమని సమాధానం చెబుతారు రేవంత్ రెడ్డి? అని హరీశ్ రావు ప్రశ్నించారు.