calender_icon.png 6 October, 2024 | 6:55 PM

యువత ఒక్కసారి ఆలోచించాలి: హరీశ్ రావు

06-10-2024 04:25:14 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని యువతకు బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పిలుపునిచ్చారు. గతేడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి తమ భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత ఒక్కసారి ఆలోచించాలని హరీశ్ రావు పేర్కొన్నారు. గ్యారెంటీలు అమలు చేయలేకపోగా, మీ ఊళ్లలో అవ్వాతాతలకు పెంచుతామన్న పింఛన్ పెంచలేదు,  రుణమాఫీ పూర్తి చేయలేదు, రైతు బంధును నిలిపివేశారు, రైతు భరోసా దిక్కులేకుండా పోయింది, బోనస్‌ను బోగస్ చేశారని ఆయన ఎద్దెవా చేశారు. 

ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి గెలుపొందిన కాగ్రెస్ ప్రభుత్వం పది నెలలు గడిచిన అతీ గతి లేకుండా పోయిందని, నిరుద్యోగ యువతకు నాలుగు వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నీళ్లు వదిలారన్నారు. ఈ దసరాకు మీ ఊళ్లకు వస్తున్న కుటుంబ సభ్యులు, స్నేహితులతో అలాయ్ ‌- బలాయ్ తీసుకుంటూ కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చర్చించాలని కోరారు. మీ ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీలతో పాటు, రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్‌లపై ఎక్కడిక్కడ నిలదీయాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు.