13-04-2025 10:50:36 AM
ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఎనిమిది కుటుంబాల్లో విషాదం: హరీశ్ రావు
హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్ రావు(Thanneeru Harish Rao) మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ప్రభుత్వ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిన ఎస్ఎల్బీసీ (SLBC tunnel accident) టన్నెల్ ప్రమాద ఘటనకు 50 రోజులు పూర్తి అయినా ప్రభుత్వ సహాయక చర్యల్లో పురోగతి లేకపోవడం అత్యంత బాధాకరం అన్నారు. తమ వారు ప్రాణాలతో తిరిగి వస్తారన్న ఆశలు పెట్టుకొని టన్నెల్ వద్దనే ఉండి రోధిస్తున్న కుటుంబ సభ్యుల ఆవేదన అరణ్య వేదన అవుతున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఎనిమిది మంది అమాయకుల ప్రాణాలను ప్రశ్నార్థకం చేసి, వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. టన్నెల్(SLBC tunnel)లో చిక్కుకున్న వారిని కాపాడడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), ఇద్దరి మృతదేహాలను వెలికి తీసి చేతులు దులుపుకుందని విమర్శించారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగి, యావత్ దేశం వారిని క్షేమంగా బయటికి తీసుకొస్తారని ఆశగా ఎదురు చూస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.
టన్నెల్లో పనులు నిర్వహించే సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం, ప్రమాదం జరిగిన వెంటనే తగిన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలం అయిందని తెలిపారు. పబ్లిసిటీ కోసం టన్నెల్ వద్దకు వెళ్ళి రావడం తప్ప ఇప్పటి వరకు చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు. ఒకసారి సమీక్ష చేయడం తప్ప చిత్తశుద్ధితో పరిష్కార మార్గం కోసం ప్రయత్నించింది లేదని మండిపడ్డారు. హెలికాప్టర్ లో వెళ్ళి మంత్రులు పెట్టిన డేట్లు మారాయి తప్ప, ఇప్పటి వరకు ఒక్కరిని ప్రాణాలతో బయటకు తెచ్చింది లేదన్నారు. సహాయక బృందాలను సమన్వయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి ఆరోపించారు.
నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర ఆలస్యం జరిగింది.. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చరిత్రలో నిలిచిపోయే అప్రతిష్ఠ అని పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని చెప్పి ఇంకెన్ని రోజులు కాలయాపన చేస్తారు..? లోపల చిక్కుకున్న ఆరుగురి పరిస్థితి ఏమిటి..? అని హరీశ్ రావు(BRS MLA Harish Rao) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కూటి కోసం, కూలీ కోసం తెలంగాణకు వచ్చి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. తీవ్ర దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు అండగా నిలవాలన్నారు. ఎస్ఎల్ బీసీ ప్రమాద ఘటన పట్ల పూర్తి స్థాయి విచారణ జరపాలని, వాస్తవాలను బయటపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీశ్ రావు డిమాండ్ చేశారు.