calender_icon.png 22 October, 2024 | 5:14 AM

హరీశ్‌రావు అబద్ధాలకోరు

22-10-2024 12:24:06 AM

  1. మమల్ని నమ్మించి ఇండ్లు ఖాళీ చేయించిండు
  2. మాజీ మంత్రిపై మల్లన్నసాగర్ బాధితులు ఫైర్

గజ్వేల్, అక్టోబరు21: కడుపులో పెట్టుకొని చూసుకుంటామని అబద్ధాలు చెప్పి నిలువునా అన్యాయం చేశారంటూ మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుపై మల్లన్నసాగర్ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం గజ్వేల్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీ పల్లెపహాడ్‌లో హరీశ్‌రావు ఫ్లెక్సీని దహనం చేశారు.

ఆయా గ్రామాల సర్పంచ్‌లు, బ్రోకర్లు, కలెక్టర్లతో కలిసి కమీషన్లు దండుకొని మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడో దొంగచాటున ప్రెస్‌మీట్లు పెట్టి తమను తాము గొప్ప చిత్రీకరించుకుంటున్న హరీశ్‌రావు, పునరావాస గ్రామాలకు వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు.

ఒక్కో ఇంటికి దారిఖర్చులకు రూ.50 వేలు ఇచ్చామంటూ మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్‌లో విలేకరులతో చెప్పారని,ఈ లెక్కన కోట్ల రూపాయల డబ్బులు ఎవరి పాలు అయ్యాయని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ నిర్వాసితుల నిరసనకు గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్‌ఖాన్, కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్కరాములుగౌడ్, ఆర్‌అండ్‌ఆర్ కాలనీ కాంగ్రెస్ నాయకులు నర్సింహారెడ్డి, రాములు, స్వామి, రమేశ్, ప్రమోద్ సంఘీభావం తెలిపారు.