హైదరాబాద్: రైతన్నలు, నేతన్నలు, ఆటో డ్రైవర్లతో మొదలైన ఆత్మహత్యల పరంపర రియల్ ఎస్టేట్ రంగానికి చేరడం దురదృష్టకరమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(BRS MLA Tanniru Harish Rao) అన్నారు. కాంగ్రెస్ పాలన పాపం అన్ని రంగాలకు శాపంగా మారిందన్నారు. ఎంతోమంది కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగుల్చుతున్నదని ఆయన మండిపడ్డారు. గతం ఎంతో ఘనం.. భవిష్యత్తు ప్రశ్నార్థకం.. అన్నట్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ గ్రోత్ ఇంజన్ అయిన హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుగా నిలిచిందని ఆరోపించారు. గడిచిన ఏడాదిన్నరగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం(Hyderabad Real Estate sector) కుదేలైందని పలు సర్వే సంస్థలు స్పష్టం చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఏలాంటి నష్ట నివారణ చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు.
నిజాన్ని దాచిపెడుతూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి దిశలో వెళ్తుంది అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం తప్ప చేస్తుందేమీ లేదని విమర్శించారు. రియల్ ఎస్టేట్ రంగం నుండి వచ్చిన రేవంత్ రెడ్డి.. మీకు ఈ విషయాలు ఎందుకు అర్థం కావడం లేదు. హైదరాబాద్ బాగుంటేనే, తెలంగాణ(Telangana) బాగుటుంది, అభివృద్ధి సాధ్యం అవుతుందన్న విషయం మీకు తెలియదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. హైడ్రా, మూసీ, ఫార్మా సిటీ, మెట్రో లైన్ మార్పు వంటి అంశాల్లో మీ అనాలోచిత నిర్ణయాలు, రియల్ ఎస్టేట్ రంగంలో డిజాస్టర్ ను తెచ్చాయని వ్యాఖ్యానించారు. రియల్ ఎస్టేట్ రంగం(Real estate sector)లో జరుగుతున్న ఆత్మహత్యలకు మీరే బాధ్యులన్నారు. మీరే మున్సిపల్ మంత్రిగా ఉన్నారు, మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారని పేర్కొన్నారు. భేషజాలకు పోకుండా ఆత్మ విమర్శ చేసుకోండని సూచించారు. ఇప్పటికైనా మేల్కోకపోతే పదేళ్లుగా పురోభివృద్ధిలో ఉన్న తెలంగాణ, తిరోగమనం బాట పట్టే ప్రమాదం ఉందని మాజీ మంత్రి హెచ్చరించారు. ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న నరసింహ గౌడ్ కుటుంబాన్ని ఆదుకోవాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.