calender_icon.png 22 March, 2025 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్‌రెడ్డితో హరీశ్‌రావు, పద్మారావుగౌడ్ భేటీ

22-03-2025 12:34:35 AM

  1. పెండింగ్ నిధులు, ప్రోటోకాల్‌పై వినతి
  2. దాదాపు 15 నిమిషాల పాటు చర్చ  
  3. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి
  4. సమావేశం అనంతరం మీడియాతో హరీశ్‌రావు చిట్‌చాట్
  5. అసెంబ్లీ సాక్షిగా బడేభాయ్, చోటేభాయ్ బంధం బయటపడిందని విమర్శ 
  6. కేంద్రం నిధులు ఇవ్వకున్నా పల్లెత్తు మాట అనడంలేదని ఆరోపణ

హైదరాబాద్, మార్చి 21 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో బీఆర్‌ఎస్ నేత, మాజీమంత్రి హరీశ్‌రావు భేటీ అయ్యారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌తో కలిసి అసెంబ్లీలోని సీఎం చాంబర్‌కు వెళ్లి దాదాపు 15 నిమిషాల వరకు సమావేశమయ్యారు.

సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫల్‌మండిలోని హైస్కూల్, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలు ఒకేచోట ఏర్పాటు చేసేందుకు బీఆర్‌ఎస్ హయాంలో రూ.32 కోట్లు విడుదల చేశారని, ఎన్నికల కోడ్ రాగానే ఆ నిధులు నిలిచిపోయాయన్న అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చేందుకు హరీశ్‌రావు, పద్మారావుగౌడ్ కలిసి వెళ్లారు.

నిధులు విడుదల చేసి పెండింగ్ పనులను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేయగా.. సీఎం సానకూలంగా స్పందించారు. ఎమ్మెల్యేల ప్రోటోకాల్ అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని, ఆ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. 

బడేభాయ్, చోటేభాయ్ బంధం బయటపడింది: హరీశ్‌రావు              

సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అనంతరం హరీశ్‌రావు అసెంబ్లీ లాబీలో మీడియాతో ఇష్టా గోష్ఠిగా మాట్లాడారు.. బడేభాయ్ (మోదీ), చోటేభాయ్(సీఎం రేవంత్‌రెడ్డి) బంధం అసెంబ్లీ సాక్షిగా బయటపడిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోయినా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కేంద్రాన్ని పల్లెత్తు మాట కూడా అనలేదన్నారు.

తెలంగాణకు నిధుల విషయంలో కేంద్రం మొండిచేయి చూపిందని, అయినా బడేభాయ్‌తో ఉన్న అనుబంధంతో సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీని ఏమి అనడంలేదని హరీష్‌రావు విమర్శించారు.

బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి బడ్జెట్ చర్చలో కాంగ్రెస్‌పై కంటే బీఆర్‌ఎస్‌పైనే ఎక్కువగా విమర్శలు చేశారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై బీఆర్‌ఎస్ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయనని, ఎవరెన్ని విమర్శలు చేసిన ప్రజలకు వాస్తవాలు తెలుసని పేర్కొన్నారు.