calender_icon.png 25 October, 2024 | 8:04 AM

కుమారుడితో సెర్బియాకు హార్దిక్ భార్య

18-07-2024 12:05:00 AM

న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిక్‌తో విడిపోయినట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ పాండ్యా సతీమణి నటాషా కుమారుడు అగస్త్యను తీసుకొని ముంబై నుంచి సెర్బియాకు వెళ్లినట్లు తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున నటాషా.. కుమారుడు అగస్త్యతో ముంబై విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న నటాషా.. ‘ ఈ సంవత్సరంలో ఆ సమయం వచ్చింది’ అంటూ కన్నీళ్లతో కూడిన ఎమోజీని షేర్ చేసింది. అయితే కొంతకాలంగా హార్దిక్, నటాషాలు విడిపోనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్ గెలిచి స్వదేశంలో అడుగుపెట్టిన పాండ్యా తన కుమారుడు అగస్త్యతో సరదాగా గడిపాడు.

ఆ ఫోటోల్లో నటాషా ఎక్కడా కనిపించలేదు. ముంబైలో జరిగిన అనంత్ వివాహానికి కూడా పాండ్యా ఒక్కడే హాజరు కావడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా నటాషా ఫోటోలతో ఈ విషయంలో ఒక స్పష్టత వచ్చింది. మరోవైపు ప్రపంచకప్ అనంతరం జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా జూలై 26 నుంచి మొదలుకానున్న టీ20 సిరీస్‌కు అందుబాటులోకి రానున్నాడు. ఈ సిరీస్‌కు పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశముంది. అయితే టీ20 సిరీస్ అనంతరం జరగనున్న వన్డే సిరీస్ నుంచి తనకు విశ్రాంతి కల్పించాలంటూ పాండ్యా బీసీసీఐని కోరినట్లు తెలుస్తోంది. నటాషాతో విడిపోనున్న నేపథ్యంలో పాండ్యా.. భార్యతో విడాకులు తీసుకోవడం కోసమే వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పాండ్యా వన్డే సిరీస్‌కు అందుబాటులో లేకపోతే సూర్యకుమార్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించే అవకాశముంది.