వితంతు మహిళపై పంచాయతీ పెద్ద అత్యాచారయత్నం
పోలీసులకు ఫిర్యాదు బిజినపల్లి మండలంలో ఘటన
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): తనకు వారసత్వంగా రావలసిన భూమిని తమ కుటుంబీకులు ఇవ్వడం లేదని పంచాయతీ పెద్దను ఆశ్రయించిన భాదితురాలికి చేదు అనుభవం ఎదురైంది. భూ సమస్యను పరిష్కరించినందుకు తన పక్కలోకి రావాలని సదరు పంచాయతీ యజమాని అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వెలిగొండ గ్రామ బస్టాండ్ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై నాగ శేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వెలుగొండ గ్రామానికి చెందిన ఓ వితంతు మహిళ తనకు రావలసిన వారసత్వ భూమి తమ దాయాదులు ఇవ్వడం లేదని గ్రామంలోని మధుసూదన్ రెడ్డి అనే ఒక పెద్ద మనిషిని కలిసి తన గోడును వెల్లడించింది.
దీంతో వారి కుల పెద్దలతో మాట్లాడి తనకు రావలసిన భూమి ఇప్పించాడు. దానికి కృతజ్ఞతగా తన పక్కలోకి రావాలంటూ బాధితురాలని బలవంతం చేశాడు. బుధవారం వెలుగొండ బస్టాండ్ వద్ద బస్సు కోసం నిలుచొని ఉన్న బాధితులని పంచాయతీ పెద్ద మనిషి బస్టాండ్ వెనుక ప్రాంతానికి బలవంతంగా ఎత్తుకెళ్లాడు. దీంతో తన నుండి విడిపించుకుని వెంటనే బిజినపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ విషయంపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై పేర్కొన్నారు.