జనగామ, విజయక్రాంతి: ఇద్దరు బాలికలపై జనగామకు చెందిన ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హాస్టల్ నుంచి పారిపోయి వచ్చిన బాలికలకు ఆశ్రయం కల్పిస్తామని చెప్పి ఈ దారుణానికి ఒడిగట్టారు. సైదాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామలోని దేవరుప్పుల మండలానికి చెందిన 14 ఏళ్ల బాలిక, మల్కాజిగిరికి చెందిన పదిహేనేళ్ల బాలిక కొన్ని నెలలుగా సైదాబాద్ ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలో ఓ ప్రైవేటు పునరావాస కేంద్రంలో కొన్ని నెలలుగా ఉంటున్నారు.
వీరిద్దరికి ఆ ఆశ్రమంలో ఉండటం ఇష్టంలేక అక్కడి నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 24న కిటికీ నుంచి దూకి బయటికి వెళ్లిపోయారు. దీంతో ఆశ్రమ నిర్వాహకులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆశ్రమం నుంచి పారిపోయిన బాలికలు అదే రోజు రాత్రి 8 గంటలకు జనగామ బస్టాండ్కు చేరుకున్నారు. దేవరుప్పులకు చెందిన బాలిక బస్టాండ్ సమీపాన పాన్షాప్ నడుపుతున్న పాముకుంట్ల సాయిదీప్ ఫోన్ నుంచి తనకు పరిచయస్థుడైన నాగరాజుకు ఫోన్ చేసింది.
వెంటనే నాగరాజు ఆమెను తీసుకుని ఓ రూముకు వెళ్లిపోయి అత్యాచారానికి పాల్పడ్డాడు. మల్కాజిగిరికి చెందిన మరో బాలిక అక్కడే ఉండగా సాయిదీప్ -పక్కనే ఉన్న బేకరీకి తీసుకెళ్లాడు. బేకరీ నిర్వాహకుడు రాజుతో కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు ఉదయం ఇద్దరు బాలికలను నాగరాజు, సాయిదీప్, రాజుతో పాటు వారి స్నేహితులు అఖిల్, రోహిత్ హైదరాబాద్ తీసుకెళ్తామని కారులో ఎక్కించుకున్నారు. ఆ తరువాత కారులో వేర్వేరు ప్రాంతాల్లో తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారు. తిరిగి జనగామ బస్టాండ్ దగ్గరే వదిలేశారు. అప్పటికే అమ్మాయిల కోసం గాలిస్తున్న సైదాబాద్ పోలీసులు జనగామ బస్టాండ్లో వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తిరిగి పునరావాస కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ భరోసా కేంద్రం నిపుణులు బాలికలను విచారించగా తమపై ఐదుగురు యువకులు లైంగిక దాడి చేసి విషయం తెలిపారు. హైదాబాద్ పోలీసులు ఐదుగురు యువకులపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.