12-04-2025 08:23:34 PM
పాల్గొన్న ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు..
తెల్లవారి నుంచి ఆలయాలకు పోటెత్తిన భక్తులు..
జై హనుమాన్ నామస్మరణతో మారుమ్రోగిన ఆలయాలు..
హనుమాన్ దీక్ష స్వాముల పూజలు భక్తులకు అన్నప్రసాదం పంపిణీ..
సందడిగా మారిన హనుమాన్ ఆలయాలు..
కామారెడ్డి (విజయక్రాంతి): జై హనుమాన్ నామస్మరణతో హనుమాన్ భక్తులు, హనుమాన్ ఆలయ పూజారులు వేద పండితుల మంత్రోచరణాల మధ్య హనుమాన్ ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. హనుమాన్ నామస్మరణతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చందన పూజతో భక్తులు హనుమాన్ జయంతినీ ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి కోడూరి ఆంజనేయ ఆలయంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, బాన్సువాడలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జుక్కల్ నియోజకవర్గంలోనీ మద్నూర్ మండల సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, మాజీ ఎంపీ బీబీ పాటిల్ తమ అనుచరులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు గ్రామాలలో హనుమాన్ జయంతి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలకు వచ్చిన ప్రజాప్రతినిధులను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలతో సన్మానించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్సువాడ బిచ్కుంద పిట్లం నిజాంసాగర్ లింగంపేట్ గాంధారి నసురుల్లాబాద్ బీర్కూర్ వర్ని తదితర మండల కేంద్రాలతో పాటు గ్రామాలలో సైతం హనుమాన్ జయంతి ర్యాలీని నిర్వహించారు.
హనుమాన్ భక్తులతో పాటు గ్రామ ప్రజలు భక్తులు కుల మతాలకతీతంగా ఉత్సవాలలో పాల్గొన్నారు. హనుమంతుని శోభాయాత్రలు నిర్వహించారు. ఘనంగా గ్రామ గ్రామాన హనుమాన్ జయంతి వేడుకలను భక్తులు నిర్వహించారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును నిర్వహించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా సిబ్బందిని నియమించి వేడుకలు ప్రశాంతంగా ముగిసేలా చేశారు.