15-04-2025 01:02:13 AM
హనుమకొండ, ఏప్రిల్ 14 (విజయ క్రాంతి): దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 నుండి 20వ తేదీ వరకు నిర్వహించే అగ్నిమాపక శాఖ వారోత్సవాల పోస్టర్ ను హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ వారోత్సవాల గురించి హనుమకొండ జిల్లా అగ్నిమాపక అధికారి కొండం జయపాల్ రెడ్డి మాట్లాడుతూ అగ్నిమాపక శాఖ వారోత్సవాల మొదటి రోజైన ఏప్రిల్ 14వ తేదీన దేశంలోని అగ్నిమాపక సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు. ఏప్రిల్ 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు, కోల్ స్టోరేజీలు, పరిశ్రమలు, మొదలైన వాటిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియజేయడం జరుగుతుందన్నారు.
అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు, ఆస్తి ప్రాణ నష్టం సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యాజమాన్యాలకు, విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు హనుమకొండలోని అగ్నిమాపక కేంద్రం 8712699304, 8712699305, పరకాల అగ్నిమాపక కేంద్రం 8712699306, 8712699307 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు. అగ్ని ప్రమాద సమాచారం త్వరగా తెలియజేస్తే ప్రమాద నష్టం ఎక్కువగా జరగకుండా చూడవచ్చునని ప్రజలకు సూచించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అగ్నిమాపక కేంద్ర అధికారులు ఎల్. దయాకర్, వి. భద్రయ్య, హనుమకొండ పరకాల అగ్నిమాపక కేంద్రాల ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.