రాజేంద్రనగర్, సెప్టెంబర్ 22: ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ బాలరాజు కథనం ప్రకారం.. సాతంరాయిలో బుడ్డరాజు దివ్య, నాగరాజు దంపతులు నివాసం ఉంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే నాగరాజు (45) గత వారం రోజులుగా ఇంట్లో మద్యం తాగుతూ ఖాళీగా ఉంటున్నాడు. ఇదిలా ఉండగా శనివారం సాయంత్రం భార్యాపిల్లలను సాతంరాయిలో ఉండే దివ్య పుట్టింట్లో వదిలిపెట్టి ఇంటికి వచ్చాడు. దివ్య ఆదివారం మధ్యాహ్నం నాగరాజుకు ఫోన్ చేయగా స్పందన లేదు. దీంతో ఆమె తన కుమారుడిని ఇంటికి పంపించి చూడగా అప్పటికే చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.