calender_icon.png 21 September, 2024 | 8:26 AM

గురుకుల విద్యార్థుల ఆచూకీ లభ్యం

20-09-2024 12:26:54 AM

ఇబ్రహీంపట్నంలో గుర్తించిన పోలీసులు 

నల్లగొండ, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా దేవరకొండలోని మైనార్టీ గురుకుల పాఠశాల నుంచి అదృశ్యమైన ముగ్గురు పదో తరగతి విద్యార్థుల ఆచూకీ లభ్యమైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బస్టాండ్‌లో వీరిని గురువారం తెల్లవారుజామున నల్లగొండ పోలీసులు గుర్తించారు. పాఠశాల ప్రిన్సిపాల్ సమక్షంలో డీఎస్పీ గిరిబాబు వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ నెల 16న సాయంత్రం ఈ ముగ్గురు పాఠశాల సమీపం నుంచి ప్యాకెట్లలో కల్లు తీసుకువచ్చారు. ఈ విషయం గుర్తించిన నాన్ టీచింగ్ సిబ్బంది తీవ్రంగా మందలించారు.

దీంతో విషయం ఉపాధ్యాయులకు తెలుస్తుందని భయపడి ఈ నెల 17న ఉదయం ముగ్గురు పాఠశాల నుంచి పరారయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆచూకీ కోసం గాలించారు. గతంలో వీరిలో ఓ విద్యార్థి ఇబ్రహీంపట్నంలో పనిచేసినట్టు విచారణలో గుర్తించి అక్కడ నిఘా పెట్టారు. బస్టాండ్ వద్ద విద్యార్థులు రోడ్డు దాటుతుండగా గుర్తించి పట్టుకున్నారు.