బలూచిస్థాన్: పాకిస్థాన్లోని నైరుతి ప్రాంతంలో ముష్కరులు 20 మంది మైనర్లను హతమార్చగా, మరో ఏడుగురిని గాయపరిచినట్లు పోలీసు అధికారి శుక్రవారం తెలిపారు. దేశ రాజధానిలో ఎస్సిఓ సదస్సుకు కొద్ది రోజుల ముందు ఈ దాడి జరిగింది. పోలీసు అధికారి హమాయున్ ఖాన్ నాసిర్ తెలిపిన వివరాల ప్రకారం, గురువారం అర్థరాత్రి డుకీ జిల్లాలోని బొగ్గు గనిలో కార్మికుల వసతి గృహాలపై ముష్కరులు దాడి చేశారు. వారు పురుషులను టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు. బాధితుల్లో ఎక్కువ మంది బలూచిస్థాన్లోని పష్తూన్ భాష మాట్లాడే ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. మృతుల్లో ముగ్గురు ఆఫ్ఘన్ వాసులు ఉండగా, మరో నలుగురు ఆఫ్ఘనిస్థాన్కు చెందిన వారు గాయపడ్డారు.
అక్టోబరు 16, 17 తేదీల్లో ఇస్లామాబాద్లో జరగనున్న పాకిస్తాన్ అధ్యక్షతన హై-ప్రొఫైల్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్ జరగడానికి కొద్ది రోజుల ముందు ఈ దాడి జరిగింది. ఈ సమ్మిట్ కు చైనా ప్రధాని లీ కియాంగ్తో సహా వివిధ దేశాధినేతలు రావచ్చని భావిస్తున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అక్టోబర్ 15న శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పాకిస్థాన్లో పర్యటించనున్నారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత భారత విదేశాంగ మంత్రి ఒకరు పాకిస్థాన్కు వెళ్లడం ఇదే తొలిసారి. 2015 డిసెంబర్లో సుష్మా స్వరాజ్ చివరి పర్యటన కావడం గమనార్హం. భద్రతా చర్యల్లో భాగంగా ఇస్లామాబాద్, రావల్పిండిలోని రెస్టారెంట్లు, కళ్యాణ మండపాలు, కేఫ్లు, స్నూకర్ క్లబ్లు అక్టోబరు 12 నుంచి 16 వరకు తాత్కాలికంగా మూసివేయబడతాయని అధికారులు వెల్లడించారు.