11-02-2025 03:33:33 PM
పటాన్ చెరు,(విజయక్రాంతి): డంపు యార్డుకు వ్యతిరేకంగా గుమ్మడిదల మండల ప్రజలు చేపట్టిన నిరసన కార్యక్రమాలు మంగళవారం నాటికి ఏడవ రోజుకు చేరుకున్నాయి. నల్లవల్లి గ్రామంలో గ్రామస్తులు చేపట్టిన నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు గుమ్మడిదలలో రైతు సంఘం జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కంటిన్యూ అవుతున్నాయి. వర్తక సంఘం పిలుపుమేరకు వ్యాపార సముదాయాలు బందు పాటించాయి. వివిధ కుల సంఘాలు రైతు జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
నల్లవల్లిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు తెలంగాణ జన సమితి నాయకులు హాజరై సంఘీభావం తెలిపారు. ఇక్కడి విషయాన్ని ఎమ్మెల్సీ కోదండరామ్ కు తెలియజేస్తామన్నారు. గుమ్మడిదలలో పశువులతో వినూత్న నిరసన తెలిపారు. పాడి పశువులతో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. వాటిపై 'డంప్ యార్డ్ ఏర్పాటు చెయ్యొద్దు.. మా పొట్ట కొట్టొద్దు' ' సేవ్ ఫారెస్ట్... సేవ్ యానిమల్స్' అని పశువులపై రాసి నిరసన తెలిపారు. కొత్తపల్లిలో డంప్ యార్డ్ ఏర్పాటును నిరసిస్తూ యువకులు వాటర్ ట్యాంక్ ఎక్కారు. అలాగే రిలే దీక్షలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు.