calender_icon.png 12 October, 2024 | 6:59 AM

‘ప్రవాసీ ప్రజావాణి’కి మార్గదర్శకాలు

12-10-2024 02:35:20 AM

 ప్రొసీజర్ ఉత్తర్వులు జారీ

ప్రతులను విడుదల చేసిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కోసం ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన ‘ప్రవాసీ ప్రజావాణి’ ఫిర్యాదుల స్వీకరణ కేంద్రం నిర్వహణకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం సెప్టెంబర్ 16న జారీ చేసిన జీవో నెం. 205కు కొనసాగింపుగా సాధారణ పరిపాలన శాఖలోని ప్రవాస భారతీయుల విభాగం పక్షాన సీఎస్ శాంతికుమారి ఈ నెల 9న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మార్గదర్శకాలను జారీ చేశారు. ప్రవాసీ ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులను సంస్థాగతంగా ప్రామాణికరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు ప్రజాభవన్‌లో ప్రవాసీ ప్రజావాణి నిర్వహణ మార్గదర్శకాల ఉత్తర్వుల ప్రతులను శుకవ్రాం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా.జి.చిన్నారెడ్డి విడుదల చేశారు.

టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, దుబాయిలోని గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షుడు గుండెల్లి నర్సింలు, స్వచ్ఛంద సేవకులు శాంతిప్రియ యాదవ్, బషీర్ అహ్మద్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రవాసీ ప్రజావాణి నిర్వహణకు ఏర్పాటు చేసిన మార్గదర్శకాల పట్ల చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్యాదేవరాజన్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.  

జీఏడీ-ఎన్నారై విభాగంలో..

గల్ఫ్ తదితర దేశాల నుంచి మృతదేహాలను ఇండియాకు తీసుకురావడం, విదేశాల నుంచి వచ్చిన శవపేటికలను హైదరాబాద్ విమానాశ్రయం నుంచి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేయడం(దారిద్రరేఖకు దిగువన వారికి), పేషెంట్లను స్వదేశానికి రవాణా చేయడం, విదేశీ జైళ్లలో ఉన్నవారికి న్యాయ సహాయం చేసి విడుదలకు కృషి చేయడం, వీసా గడువును మించి అక్కడే నివసించడం, అత్యవరస పరిస్థితులు, క్షమాభిక్ష, జీతం బకాయిలు ఇప్పించడం, విదేశాల్లో మన వారికి అవసరమైన అన్ని సేవలను జీఏడీ విభాగం నేరుగా పర్యవేక్షిస్తుంది. విదేశాల్లోని భారత రాయభార కార్యాలయాలు, ఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో అనుసంధానం చేస్తుంది.