calender_icon.png 7 October, 2024 | 1:37 AM

ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలపై జీఎస్టీ తగ్గించాలి

03-09-2024 03:27:35 AM

కేంద్రమంత్రి గడ్కరీ

న్యూఢిల్లీ: ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలపై జీఎస్టీ తగ్గించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఈ తరహా వాహనాలపై జీఎస్టీని 12 శాతానికి పరిమితం చేయాలన్నారు. జీఎస్టీ తగ్గించడంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల పాత్ర కీలకమని వ్యాఖ్యానించారు. బయో ఎనర్జీ అండ్ టెక్ ఎక్స్‌పోలో ఆయన మాట్లాడారు. శిలాజ ఇంధనాల వినియోగం తగ్గించి., బయో ఫ్యూయల్ వాడకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఒకటి కంటే ఎక్కువ ఇంధన రకాలతో నడిస్తే వాటిని ప్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు అంటారు. సాధారణంగా పెట్రోల్. ఇథనాల్, మిథనాల్ వంటి ఇంధనాలతో వీటిని నడపొచ్చు.

అయితే, ఈ తరహా వాహనాలపై జీఎస్టీ తగ్గించాలంటే రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాయం ముఖ్యమన్నారు. ఇదే విషయమై గతంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కోరినట్లు చెప్పారు. ఇటీవల మహారాష్ట్ర ఆర్థిక మంత్రి అజిత్ పవార్‌తోనూ ఇదే విషయమై మాట్లాడానని చెప్పారు. ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో నిర్వహించే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం గురించి లేవనెత్తాలని సూచించినట్లు చెప్పారు.

ఏటా మన దేశం రూ.22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోందని గడ్కరీ అన్నారు. ఈ ఇంధన వాడకం అనేది పర్యావరణంపైనే కాకుండా ప్రభుత్వ ఖజానాపైనా భారం పడుతోందన్నారు. అందుకే శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి.. బయో ఫ్యూయల్‌ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. దీనివల్ల అటు వ్యవసాయ రంగానికీ మేలు చేకూర్చినట్లవుతుందన్నారు.