calender_icon.png 3 October, 2024 | 2:42 PM

బీమాపై జీఎస్టీ నిర్ణయ వచ్చే భేటీలోనే

10-09-2024 12:43:25 AM

  1. బీహార్ డిప్యూటీ సీఎం నేతృత్వంలోని మంత్రుల బృందాని బాధ్యత అప్పగింత 
  2. క్యాన్సర్ ఔషధాలు, స్నాక్స్‌పై జీఎస్టీ తగ్గింపు 
  3. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి

న్యూఢిల్లీ: జీవిత, ఆరోగ్య బీమాపై జీఎస్టీ  తగ్గింపుపై జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయం వాయిదా పడింది. ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని తగ్గించేందుకు మండలిలో ఏకాభిప్రా యం కుదిరినప్పటికీ.. తదుపరి భేటీలో దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వం లో సోమవారం జరిగిన 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై విస్తృత చర్చ జరిగింది. ఇదే భేటీలో క్యాన్సర్ ఔషధాలపైన, స్నాక్స్‌పైనా జీఎస్టీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సమావేశం వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు దెల్లడించారు. జీవిత, ఆరోగ్య బీమాలపై జీఎస్టీని తగ్గించాలన్న డిమాండ్లు వెల్లువెత్తున్న వేళ ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనే ఈ మేరకు నిర్ణయం వెలువడుతుందని అంద రూ భావించారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన మండలి మంత్రుల బృందానికి ఆ బాధ్య తను అప్పగించింది.

బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై ఏర్పాటయిన మంత్రుల బృందానికే ఈ బాధ్యతను కూడా అప్పగించారు. కొంతమంది కొత్త సభ్యులు ఈ బృందంలో చేరుతారని, అక్టోబర్ చివరినాటికి నివేదిక సమర్పిస్తారని సీతారామన్ చెప్పారు. దీనిపై నవంబర్‌లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా క్యాన్సర్ ఔషధాలపై ప్రస్తుతం 12 శాతంగా ఉన్న జీఎస్టీ రేటును 5 శాతానికి తగ్గిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే స్నాక్స్‌పై 18 శాతంనుంచి 12 శాతానికి జీఎస్టీని  తగ్గించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. 2026 మార్చి తర్వాత జీఎస్టీ పరిహార సెస్‌ను కొనసాగించాలా, వద్దా అనే అంశంపైనా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పా టు చేయనున్నట్లు సీతారామన్ తెలిపారు. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ, ఆన్‌లైన్ గేమింగ్‌పై జీఎస్టీ అంశాలపైనా సమావేశంలో చర్చించినట్లు ఆమె తెలిపారు.