సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్
న్యూఢిల్లీ, అక్టోబర్26: రేడియోతో తనకు విడదీయలేని సంబంధం ఉందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. సుప్రీంకోర్టు వజ్రోత్సవాలు జరుగుతున్న వేళ ఆల్ ఇండియా రేడియోకు సీజేఐ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ తన చిన్నతనంలో అమ్మానాన్నలతో కలిసి రేడియోలో హిందీ, ఇంగ్లీష్, సంస్కృతంలో వచ్చే వార్తలు వింటూ పెరిగానని వివరించారు. ప్రముఖ న్యూస్ ప్రెజెంటర్లు దేవకీ నందన్ పాండే, పమీలా సింగ్, లోతికా రత్నం లాంటి వారు ‘ ఆకాశవాణి.. ఈ రోజు వార్తలు చదువుతున్నది’ అని వారు చెబుతుంటే ఆసక్తిగా వినేవాడినని, వారి గొంతు ను తాను ఎప్పటికీ మరిచిపోలేనని స్పష్టం చేశారు. రేడియోలో తాను ప్రెజెంటర్గా పనిచేసినప్పటి విషయాలను ఆయన గుర్తు చేశారు. అమ్మకు శాస్త్రీయ సంగీతంలో పట్టు ఉండడంతో రేడియోలొ అనేక ప్రోగ్రామ్స్ చేసేవారని, అప్పుడు అమ్మతోపాటు తాను కూడా ముంబైలోని స్టూడియోకు వెళ్లానని చెప్పారు. ఆ తరువాత 1974లో ఢిల్లీకి మారడంతో రేడియోలో అడిషన్కు వెళ్లానని, అలా 19 ఏండ్ల వయస్సులో న్యూస్ ప్రెజెంటర్గా రేడియోలో చేరానని సీజేఐ పేర్కొన్నారు. తాను ఇచ్చిన తొలి ప్రోగ్రాం తనకు ఇంకా గుర్తు ఉందని, ఆ సమయంలో వెస్ట్రన్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్కు హోస్ట్గా కూడా వ్యవహరించానని తెలిపారు.