18-03-2025 12:00:00 AM
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ డోస్తో పాటు సినిమాల విషయంలో స్పీడ్ పెంచింది. ‘టిల్లు స్కేర్’ నుంచి అమ్మడు గ్లామర్ డోస్ పెంచేసింది. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ శర్వానంద్తో కలిసి సినిమా చేయనుంది. సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభం కానుంది.
గతంలో శర్వా, అనుపమ కాంబోలో వచ్చిన ‘శతమానం భవతి’ సినిమా ఎంత మంచి హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి దిల్ రాజు సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు. ‘శతమానం భవతి నెక్ట్స్ పేజి’ పేరుతో ఈ సీక్వెల్ రూపొందనుంది. అయితే ఎందుకోగానీ ఈ సినిమా ప్రకటనతోనే ఆగిపోయింది. ప్రస్తుతం శర్వా నంద్.. అభిలాస్ కంకర అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు.
దీని తర్వాత రామ్ అబ్బరాజుతో సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాలను ఈ ఏడాదే ముగించేసి ఆ తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. మరోవైపు అనుపమ ప్రస్తుతం ‘పరదా’ అనే చిత్రం చేస్తోంది.
రెండు తమిళ్, రెండు మలయాళ సినిమాల్లో నటిస్తోంది. అలాగే ధ్రువ్ విక్రమ్ హీరోగా రూపొందుతున్న ‘బిసన్’ చిత్రంలోనూ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలన్నింటినీ ముగించేసుకుని శర్వాతో సినిమాను అనుపమ మొదలు పెట్టనుందని సమాచారం.