28-04-2025 12:47:19 AM
గత సంవత్సరాకి నేటికి రెట్టింపు
కొనలేక ఇబ్బంది పడుతున్న సామాన్యులు
సూర్యాపేట, ఏప్రిల్27(విజయక్రాంతి) : తెలుగు రాష్ట్రాల్లో మామిడికాయ పచ్చడిని ఇష్టపడని వారుండారు. అయితే రెండు సంవత్సరాలుగా పచ్చడి సరుకుల ధరలు మంట పుట్టిస్తున్నాయి. ఏ సరుకు కొనాల న్నా జేబులు ఖాళీ అవుతున్నాయి. గతంతో పోల్చితే పచ్చడి సరుకుల ధరలు సుమారు 30 శాతం నుంచి 40 శాతం వరకు పెరగడంతో సామాన్యులు బెంబేలెత్తిపో తున్నారు. ధరలే ఇలా ఉంటే పచ్చడి పెట్టిన ట్టేనంటూ గృహిణులు నిట్టూర్చుతున్నారు.
రెండింతలు పెరిగిన ధరలు
సాధారణంగా మార్చిలో అపరాలు పంటల దిగుబడి రావడం వల్ల సరుకుల ధరలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ సమయంలో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ముందుగా అపరాలు, మసాలా సరుకులు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి జాగ్రత్త చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ నేడు అపరాలు, మసాలా దినుసుల ధరలు గతంలో కంటే అధికంగా పెరగడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది.
పచ్చడి సరుకుల ధరలు ఈ వేసవిలో రెండితలు పెరిగాయని వినియోగదారులు వాపోతున్నారు. మరోవైపు పచ్చడి మామిడి కాయల ధరలూ చుక్కలంటాయి. దేశవాళి మామిడి చెట్లు పూత దశలో మంచువల్ల పూత రాలిపోగా... మార్చిలో గాలిదుమ్ములకు ఉన్న కాస్తా మామిడి కాయలు రాలిపోయాయి. దీంతో కాయలు దొరకడం గగనంగా మారింది. మరోవైపు ఎండుమిర్చి ధర ఘాటెక్కితోంది.
గతంలో రిటైల్ మార్కెట్లో పచ్చడి కాయా కేజీ రూ.350 ఉండగా ప్రస్తుతం రూ.650 పలుకుతోంది. అదే విదంగా పచ్చడి కారం ఫౌడర్ కేజి రూ. 250 ఉండగా ప్రస్తుతం రూ. 650కి పైగా అమ్ముతున్నారు. ఈ సంవత్సరం కురిసిన వర్షాల వల్ల మిర్చి పంట పూత దశలో పూర్తిగా నాశనం కావడంతో దిగుబడి తగ్గిపోయిందని వ్యాపారస్తులు చెబుతున్నారు. మరోవైపు మార్కెట్ డిమాండ్ అనుసరించి వ్యాపారులు ధరలు రెట్టింపు చేశారు.
పచ్చడి ప్రియులపై తీవ్ర ప్రభావం
మామిడి పచ్చడి వేసవిలోనే ఎక్కువగా పెట్టే విషయం తెలిసిందే. ఎక్కువ మంది సంవత్సరానికి సరిపడ పచ్చడి పెట్టి నిల్వ చేసుకుంటారు. ఈసారి పచ్చడి సరుకుల ధరలు అమాంతం పెరిగి పోవడంతో సంవత్సరాకి సరిపడా పెట్టుకునే పరిస్థితి లేదంటున్నారు.