22-04-2025 06:40:17 PM
భద్రాచలం (విజయక్రాంతి): ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా గ్రీన్ భద్రాద్రి సభ్యులు భద్రాచలం జీవన్ హస్పిటల్, శ్రీ అభయాంజనేయ స్వామి పార్క్ ముందు కుండీలలో ఫై కస్ పాండా గోల్డ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ... మానవ మనుగడకు ఆధారమైన పుడమి ఋణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిదని, విరివిగా మొక్కలు నాటటం, ప్లాస్టిక్ నిషేధం, ఇంటికో ఇంకుడు గుంట వంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు తమ విధిగా చేపట్టాలని, అప్పుడే వాతావరణ అసమతుల్యత సమస్య నుండి బయటపడతామన్నారు.
గ్రీన్ భద్రాద్రి నిరంతరం ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతుందని, ప్రతి ఒక్కరు కూడా ఇదే స్పూర్తితో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తదుపరి సభ్యుల చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి ట్రస్ట్ అధ్యక్షులు లయన్ యేగి సూర్య నారాయణ, గౌరవ అధ్యక్షులు పర్యావరణ ప్రేమికుడు హరితమిత్ర లయన్ డా.గోళ్ళ భూపతిరావు, పాస్ట్ ప్రెసిడెంట్ కామిశెట్టి కృష్ణార్జునరావు, చల్లగుళ్ళ నాగేశ్వరావు, డా. కృష్ణ ప్రసాద్, డా. స్పందన, L. వెంకటేశ్వర్లు, డి ఆర్ వో శోభన్, రాణి, జీవన్ హస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.