07-04-2025 10:25:36 PM
మునిపల్లి: ద్విచక్రవాహనంపై అక్రమంగా రవాణా చేస్తున్న 120 గ్రాముల ఎండు గంజాయిని మునిపల్లి పోలీసులు సోమవారం నాడు కంకోల్ టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జహీరాబాద్ వైపు నుండి హైదరాబాద్ వైపు నుంచి యాక్టివా స్కూటీపై ఇద్దరు వ్యక్తులు ఎండు గంజాయిని రవాణా చేస్తున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు.
ఈ సందర్భంగా జహీరాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ స్కూటీపై వెళ్తున్న (మహ్మద్ ఆయూబ్, షేక్ సమీర్ లు) ఇద్దరిపై అనుమానం వచ్చి తనిఖీ చేయగా అందులో 120 గ్రాముల ఎండు గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వారిని విచారించగా బీదర్ లోని ఇర్ఫానీ గల్లికి చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తి వద్ద ఎండు గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్ రవాణా చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఎండు గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరిని పట్టుకోవడంతో పాటు ఎండు గంజాయిని స్వాధీనం చేసుకోవడంపై ఎస్ఐ రాజేష్ నాయక్ ను సిబ్బంది ఎండి హనీఫ్, పాండు, తుకారం, దత్తు, సునీల్ లను కొండాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ అభినందించారు.