26-01-2025 12:00:00 AM
కోరుట్ల, జనవరి 25 (విజయక్రాంతి) : సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక సాకుతో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు గ్రామ, వార్డు సభలను ప్రభుత్వం నిర్వహిస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ విమర్శించారు. శనివారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభలను కాంగ్రెస్ సభలు మార్చిందని, గ్రామ, వార్డు సభల వల్ల ప్రజలకు ఏమి ప్రయోజనం లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల మంజూరు విషయంలో స్పష్టత లేదని మండిపడ్డారు. మంత్రులు సంక్షేమ పథకాల అమలు తీరుపై ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఆదాయాన్ని రూ.80 వేల కోట్ల నుంచి రూ.3లక్షల కోట్లకు పెంచిన ఘనత కేసీఆర్ సర్కారుదేనన్నారు.
ప్రభుత్వ పథకాల కోసం కాంగ్రెస్ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇళ్లు ఇప్పిస్తామని రూ.10 వేలు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఎవ్వరూ కూడా ప్రభుత్వ పథకాల కోసం కాంగ్రెస్ నాయకులకు డబ్బులు ఇవ్వవద్దన్నారు. ఈ సమావేశంలో మండలాధ్యక్షులు దారిశెట్టి రాజేష్, చీటి వెంకట్రావ్, ఫయీం, మురళి, సందయ్య, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.