18-03-2025 01:47:50 AM
నల్లగొండ, మార్చి 17 (విజయక్రాంతి) : జిల్లాలో వరి కోతలు ప్రారంభమైనందున ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి కోరారు. సోమవారం కిసాన్ మోర్చా నాయకులతో కలిసి ఈ మేరకు కలెక్టర్ ఇలా త్రిపాఠికి ఆయన వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్నికల హామీ మేరకు రైతులందరికీ ప్రభుత్వం రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
రైతు భరోసా సాయం వెంటనే ఖాతాల్లో జమ చేయాలని, పీఎం ఫనల్ భీమా రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు. పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని, ఎండి నష్టపోయిన వారికి ఎకరానికి రూ.30 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దొడ్డు ధాన్యానికి సైతం రూ.500 బోనస్ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకట్రెడ్డి పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.