01-04-2025 02:43:59 AM
రాజ్భవన్ ఎదుట ఏబీవీపీ నాయకుల నిరసన
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31(విజయక్రాంతి) : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) భూముల విషయంలో గవర్నర్ స్పందించి, జోక్యం చేసుకోవాలని ఏబీవీపీ హైదరాబాద్ నగర కార్యదర్శి పృథ్వితేజ, రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజు కోరారు. మంగళవారం రాజ్ భవన్ ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెచ్సీయూకు చెందిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యంగా లాక్కోవాలని చూస్తున్నా, విద్యార్థు లపై విచక్షణా రహితంగా పోలీసులు దాడి చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్ స్పందించకపోవడం విడ్డూరమన్నారు. ఇప్పటికైనా ఆయన స్పందించి హెచ్సీయూ భూములను రక్షించాలని విజ్ఞప్తి చేశారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ మహేష్, నాయకులు ఉదయ్, విక్రమ్, బాలు, ఆదిత్య, శ్వేత, ప్రణీత్, ఆకాశ్, రేవంత్, రాకేష్, నందు, చరణ్, నవీన్తదితరులు పాల్గొన్నారు.