13-03-2025 12:05:34 AM
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
అచ్చంపేట మార్చి 12 : నల్లమల చెంచుపెంటల్లో నివసిస్తున్న చెంచుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని దోమల పెంట వనమయూరి గెస్ట్ హౌస్లో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి ఆధ్వర్యంలో గవర్నర్ పర్యటన సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లను, చెంచు పెంటలలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
చెంచులకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, హౌసింగ్, తాగునీరు, రహదారి సౌకర్యాలు వంటి ప్రాధమిక అవసరాలను మెరుగు పరచేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అప్పాపూర్ పరిధిలోని అప్పాపూర్, భౌరాపూర్, ఈర్లపెంట, సంగిడి గుండాల, మేడిమల్కల చెంచు పెంటలలో నివ మిషన్ భగీరథ అధికారులు చెంచుపంటలలో చెక్ డ్యామ్ల నిర్మాణం త్వరిత గతిన పూర్తి చేయాలని, బావులను త్రవ్వించాలని, పాఠశాలలో కనీస సదుపాయాలైన నీటి వసతి కరెంటు, విద్యార్థులు కూర్చునేందుకు బల్లలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. చెంచుపెంటలలోనీ ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యుఎస్, ఐటీడీఏ పీవో, గిరిజన కార్పొరేషన్, డీఆర్డీఓ, డిటిడిఓ, రెడ్కో శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.