12-02-2025 03:56:58 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఒక రైతుకు వచ్చిన రైతు భరోసా(Rythu Bharosa)పై బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) చేసిన ట్వీట్ కు ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్(Government Whip Adi Srinivas) బుధవారం కౌంటర్ ఇచ్చారు. అబద్దాలు ఆడడంలో హరీష్ రావును మించిన వారు ఎవరూ లేరని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) చేస్తున్న మంచి పనులను చూస్తూ ఓర్వలేక ప్రభుత్వంపై మూడు నెలల నుండి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహించారు. బాబా బామ్మర్దులు ఒకరిపై మరొకరుపై చేయి సాధించడానికి లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలకు కల్లి బోల్లి కబుర్లు చెప్తున్నారని ఆది శ్రీనివాస్ చెప్పారు. మసి పూసి మారేడు కాయ చేసినట్లుగా, బట్ట కాల్చి ప్రభుత్వంపై వేసే విధంగా హరీష్ రావు, కేటీఆర్, ఈ మధ్య కవిత కూడా వీళ్లకు తోడైందని వ్యాఖ్యానించారు. గత పది సంవత్సరాలగా బీఆర్ఎస్ పరిపాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి అప్పుల కుప్పగా మార్చారు.రైతులకు రైతు భరోసా అందిస్తే చూసి ఓర్వలేక పోతున్నారని, బీఆర్ఎస్ హయాంలో రైతులకు 40 కిలోల సంచికి 44 కిలోలు జోకి రైతులను నిలువున ముంచారని ఆరోపించారు. రైతు రుణమాఫీపై రైతులను మోసం చేశారు. రైతులకు రైతు భరోసా అందిస్తూ మొన్నటి రోజున ఎకరం, రెండు ఎకరాలు ఇలా రైతులకు అందిస్తే అబద్దాల హరీష్ రావు ఒక దుష్ప్రచారానికి తెరలేపారని ప్రభుత్వ విప్ వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందిన నకీర్తి కనకవ్వకు రైతు భరోసా విషయంలో 31 గుంటలు ఉంటే కేవలం రూ.1650 వేశారని హరీశ్ రావు అబద్ధాలు మాట్లాడుతున్నారు. నకీర్తి కనకవ్వకు 580/బిలో 4 గుంటలు, 943/10 లో 7 గుంటలు మొత్తం 11 గుంటలు ఉంటే దానికి రూ.1650 వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. కావాలంటే పొత్గల్ లోని వారి బ్యాంకు ఖాతాలో ఒకసారి సరి చూసుకోగలరని సూచించారు. 11 గంటలు ఉంటే 33 గుంటలు ఉన్నాయని హరీశ్ రావు ఒక దుష్ప్రచారం చేస్తున్నారని, హరీష్ రావు ఒకసారి కళ్ళకు కంటి ఆపరేషన్ చేయించుకోవాలని హస్యం చేశారు. దుష్ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ గా హరీష్ రావు నిలుస్తున్నారని, అసెంబ్లీలో కుల గణనపై కూడా ఇలానే అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ చేసిన కులగణనను బయట పెట్టకుండా ఎందుకు అటకెక్కించారని ప్రశ్నించారు. 61 శాతం బీసీలకు ఇచ్చామంటున్నారు తీరా చూస్తే 51 శాతమే ఉంచారని, రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నకీర్తి కనకవ్వ రైతు భరోసా విషయంలో హరీష్ రావు చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని మరోసారి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హెచ్చరించారు.