calender_icon.png 25 September, 2024 | 3:47 PM

సమస్యల ఒడిలో సర్కార్ బడి

06-09-2024 12:38:33 AM

  1. మంగళపర్తి జెడ్పీహెచ్‌లో మౌలిక వసతులు కరువు 
  2. కానరాని పారిశుద్ధ్యం, లోపించిన పర్యవేక్షణ 
  3. కలెక్టర్ ఆదేశాలూ బేఖాతరు? 
  4. పట్టించుకోని విద్యాశాఖ ఉన్నతాధికారులు 
  5. ‘విజయక్రాంతి’ విజిట్‌లో బట్టబయలు

వెల్దుర్తి, సెప్టెంబర్ 5: ప్రభుత్వ బడుల్లో అపరిశుభ్రతకు తావులేకుండా మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా.. రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం కింద చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ ఇటీవల జిల్లాలోని పలు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించడంతో పాటు అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయడంతో పాటు ఆయా పనులను కూడా పూర్తి చేయించారు. అయితే ఇవేమీ వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు వర్తించవు అనేలా ఉంది అక్కడి పరిస్థితి.

ఈ పాఠశాలలో అపరిశుభ్రత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. జెడ్పీహెచ్‌లో దాదా పు 103 మంది విద్యార్థులు, 9 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ పాఠశాల ఆవరణ లోనే  ప్రాథమిక ఉన్నత పాఠశాల కూడా ఉండగా అందులో 92 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశా ల కాంపౌండ్‌లోనే ఓ అంగనవాడీ కేంద్రం కూడా నడుస్తోంది. 

వసతుల కల్పనలో విఫలం..

రెండు పాఠశాలలు ఒక అంగన్‌వాడీ కేం ద్రం ఉన్న ఇక్కడ మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమ య్యారు. పాఠశాల ఆవరణలో ‘మన ఊరు మన బడి’లో భాగంగా నీటిసంపు నిర్మాణం చేపట్టారు. అయితే సంపును అసంపూర్తిగా నిర్మించి పైకప్పు లేకుండా వదిలేశారు. దీంతో వర్షాలు పడినప్పుడు సంపులోకి నీరు చేరడంతో పాటు ఆరు బయట వినియోగించే నీరు సైతం అందులోనే పడుతోంది. రోజుల తరబడి నీరు నిల్వ ఉండటంతో దుర్గంధం వెదజల్లడంతో పాటు దోమల వ్యాప్తి పెరిగి విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. 

కంపుకొడుతున్న బాత్‌రూంలు, పొంచిఉన్న ప్రమాదం

పాఠశాలలో బాత్‌రూంల నిర్వహణ సరిగా లేకపోవడంతో కంపుకొడుతున్నాయి. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆరుబయటే మూత్ర విసర్జన చేయాల్సిన పరస్థితి నెలకొంది. ప్రాథమిక ఉన్నత పాఠశాలలో బోరు మోటార్ ప్రమాదకరంగా మారింది. విద్యుత్ సరఫరా చేసే వైర్లు, స్విచ్ బోర్డులు సరిగా లేకపోవడంతో పలుమార్లు విద్యుదాఘాతానికి గురైనట్లు విద్యార్థులు చెబుతు న్నారు. అలాగే పాఠశాల ఆవరణలో ఎండిపోయిన చెట్టు ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 

జిల్లా కలెక్టర్ ఆదేశించినా..

బడులు ప్రారంభించే సమయానికి పాఠశాలల స్థితిగతులు మార్చి ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని గత వేసవిలో మెదక్ జిల్లా కలెక్టర్ ఆదేశించినా మంగళపర్తి జెడ్పీహెచ్‌ఎస్‌లో మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా నిధులను కేటాయించి పలు పాఠశాలలను అభివృ ద్ధి చేసిన ప్రభుత్వం మంగళపర్తి పాఠశాలను కూడా పట్టించుకోవాలని గ్రామ స్తులు కోరుతున్నారు. పాఠశాలలో సమస్యలపై సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు.

సమస్యలు పరిష్కరిస్తాం..

మంగళపర్తి జెడ్పీహెచ్‌ఎస్‌లో జెడ్పీహెచ్‌ఎస్‌లో వసతుల లేమితో విద్యా ర్థులు ఇబ్బంది పడుతున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. పాఠశాలలోని సంపుపై రేకులను వేయిస్తాం. అలాగే పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసకువెళ్లి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తాం.

                    -మహ్మద్ ఖదీర్, పంచాయతీ కార్యదర్శి, మంగళపర్తి