calender_icon.png 20 September, 2024 | 11:11 AM

ప్రభుత్వ ప్రాధాన్యత విద్యార్థులే

07-09-2024 12:38:49 AM

సొంత పిల్లల్లాగా చూసుకోవాలె

హాస్టళ్లను అమ్మ ఒడిలా తీర్చిదిద్దాలె

వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి సీతక్క

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయ క్రాంతి): రాష్ట్రంలోని విద్యార్థులే ప్రజాప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని  మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకుల సంస్థల్లో విద్యాబోధన, మౌలిక వసతులు, భోజన వసతి, తదితర అంశాలపై శుక్రవారం సచివాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎస్టీ సంక్షేమ శాఖ సీఎం రేవంత్‌రెడ్డి వద్ద ఉందని, అందుకే విద్యార్థుల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు.

సంక్షేమ పాఠశాలలు, హాస్ట ళ్లు అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి, అభివృద్ధికి ప్రత్యేకంగా నిలవాలని సూచించారు. ఆ దిశలో అంతా కలిసి పనిచేసి స్కూల్, హాస్టళ్లను అమ్మ ఒడిలా తీర్చిదిద్దాలని విజ్ఞ ప్తి చేశారు. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల పదోన్నతులు, బదిలీలు పూర్తి చేశామన్నారు. విధుల పట్ల అలస త్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్షాకాలంలో టీచర్లు, వార్డెన్లు పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. విద్యార్థులు హాస్టల్ విడిచి వాగుల వద్దకు, అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకుండా చూడాలన్నారు. విద్యార్థులు జ్వరాల బారిన పడితే ఇంటికి పంపకుండా మనమే మెరుగైన వైద్యం అందించాలని, హాస్టల్ విద్యార్థులను సొంత పిల్లల్లాగా చూసుకోవాలని సూచించారు. నాణ్యమైన వేడి భోజనం, వేడి చేసి చల్లార్చిన తాగు నీటిని ఇవ్వాలని ఆదేశించారు. 

మెనునూ తప్పకుండా ఫాలో కావాలన్నారు. సరుకుల సరఫరా సరిగా లేకపోతే టెండర్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగుల స్థుర్యైన్ని దెబ్బతీసేలా కొందరు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీచర్లు, వార్డెన్లు, సిబ్బంది మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. మానవత్వాన్ని జోడిం చి మంచి విద్యను, నాణ్యమైన సేవలను అందించాలన్నారు. మీ కృషే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని స్ప ష్టం చేశారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, గురుకుల కార్యదర్శి సీతాలక్ష్మి, ఐటీడీఏ పీవో లు, డిప్యూటీ డైరెక్టర్లు, జిల్లా అధికారులు,  హెచ్‌ఎంలు, వార్డెన్స్ తదితరులు పాల్గొన్నారు.