calender_icon.png 25 September, 2024 | 3:54 AM

ప్రభుత్వ స్థలాలు పేదలకు పంచుతాం

25-09-2024 01:36:08 AM

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 

ఖమ్మంలోబైక్‌పై పర్యటన 

ఖమ్మం, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకుని, అర్హులైన పేదలకు పంచుతామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. మంగళవారం ఖమ్మం లోని వరద ప్రాంతాల్లో బైక్‌పై పర్యటించి, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను సంపూర్ణంగా ఆదుకుంటామని, ప్రతి ఒక్కరికి పరిహారం అందజేస్తామని హామీఇచ్చారు.  ఖమ్మం కార్పొరేషన్‌లో రూ.రెండు కోట్లతో 12 సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు.  

చివరి ఆయకట్టుకూ నీరందిస్తాం

కృష్ణా పరివాహాక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు పడటంతో రెండు పంటలకు సరిపడా ప్రాజెక్టుల్లో నీరున్నదని, ప్రభుత్వం చిత్తశుద్ధితో రెండు పంటలకు చివరి ఆయకట్టు వరకూ సాగునీరు విడుదల చేస్తుందని రెవెన్యూశాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితెలిపారు. కూసుమంచి మండలం హట్యాతండాలో పాలేరు ఎడమ కాల్వకు మంగళవారం నీటిని విడుదల చేశారు. సాగర్ కాల్వకు మళ్లీ గండ్లు పడకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. 

కళాశాల ప్రారంభం

కూసుమంచి, సెప్టెంబర్ 24: సీఎం సహకారంతో కూసుమంచిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేశామని, కార్పొరేట్‌కు దీటుగా కళాశాలను అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కళాశాలను కలెక్టర్ ముజామిల్‌ఖాన్‌తో కలిసి ప్రారంభించారు. రెండేళ్ల లో ప్రైవేట్‌కు ధీటుగా కళాశాలను తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు.