calender_icon.png 25 September, 2024 | 7:46 PM

ప్రభుత్వ ఆసుపత్రులను పేద ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలి

25-09-2024 05:57:29 PM

పెద్దపల్లి,(విజయక్రాంతి): రోగుల కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా కల్పించిన వసతులు , వైద్య సేవలను ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, ఎమ్మెల్యే విజయ రమణారావులు కోరారు. బుధవారం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే తో కలిసి జిల్లా ఆసుపత్రి, మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కంటి శస్త్ర చికిత్స విభాగం, చిన్న పిల్లల వైద్య విభాగం, డీఈఐసీ, ఏసీ పేయింగ్ రూంలు, ఔట్ పోస్ట్, డెంటల్ విభాగంలో పరికరాలు, ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో నేడు ప్రారంభించుకున్న నూతన పరికరాలు, విభాగాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.  ఆర్థోపెడిక్, కంటి శస్త్ర  చికిత్స, డెంటల్ విభాగం, చిన్న పిల్లల వైద్య సదుపాయాలు అందుబాటులోకి తెచ్చామని వీటిని ప్రజలు సంపూర్ణంగా వినియోగించుకోవాలని తెలిపారు. ఎమ్మెల్యే  మాట్లాడుతూ... జిల్లా ఆసుపత్రిలో  పోలీసు ఔట్ పోస్టు, కంటి శస్త్ర చికిత్స విభాగం, చిన్న పిల్లల  వైద్య సదుపాయాలు, డెంటల్ పరికరాలు మొదలగు సేవలు కొత్తగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

గత 3 నెలలుగా జిల్లా ఆసుపత్రి, ఎంసిహెచ్ పనితీరు గణనీయంగా మెరుగైందని, ప్రసవాల సంఖ్య,  ఆర్థోపెడిక్ శక్తుల చికిత్సలు, ఓపి సేవలు, డయాగ్నిస్టిక్ హబ్ ద్వారా పరీక్షల నిర్వహణ వంటివి పెరిగాయని, ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల విశ్వాసం బలపడుతుందని, పిఎంసిహెచ్ లో గర్భిణుల కోసం టిఫా స్కానింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని, అదే విధంగా జిల్లా ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ విభాగంలో సంక్లిష్టమైన క్షత్రియ చికిత్సలు చేయడానికి సీనియర్ ఆర్థోపెడిక్ వైద్యులు ఉన్నారని, దంతాలకు కావిటి ఫీలింగ్, రూట్ కెనాల్ సర్జరీ నిర్వహణ జరుగుతుందని, కంటి శస్త్ర చికిత్సల పరికరాలు అందుబాటులోకి వచ్చాయని, వీటిని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.  జిల్లా ఆసుపత్రిని 150 పడకల ఆసుపత్రికి పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్  డాక్టర్ శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, ఆర్.ఎం.ఓ డాక్టర్ రవీందర్,  సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.