- 24 గంటల్లో మూడుచోట్ల కాల్పులు
- గ్యాంగ్స్టర్ల పేరుతో పేపర్ స్లిప్పుల విసిరివేత
- 4 కిలోల బంగారం దోచుకెళ్లిన దుండగులు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: దేశ రాజధాని ఢిల్లీలో దోపిడీ దొంగలు, గ్యాంగ్స్టర్లు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. 24 గంటల వ్యవధిలో మూడుచోట్ల కాల్పులు జరిపి భారీ దోపిడీలకు పాల్పడ్డారు.
సెంట్రల్ ఢిల్లీలోని కరోల్బాగ్కు చెందిన ఓ బంగారం వ్యాపారి శుక్రవారం రాత్రి ఆటోలో ఉత్తర ఢిల్లీలోని గులాబి బాగ్కు వెళ్తుంగా బైక్పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపి అతడి వద్ద నుంచి 4 కిలోల బంగారం దోచుకెళ్లారు. దాని విలువ రూ.3.5 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.
మరోవైపు నరైనా ప్రాంతంలో ఉన్న ఓ లగ్జరీ సెకండ్ హ్యాండ్ కార్ల షోరూంలోకి చొరబడిన ముగ్గురు దొంగలు కాల్పులు జరిపి అక్కడివారిని భయభ్రాంతులకు గురిచేశారు. ‘భాను గ్యాంగ్’ అని రాసి ఉన్న ఓ పేపర్ను దుండగులు షోరూంలో వదిలి వెళ్లారు. మహిపాల్పూర్లో ఉన్న ఒక హోటల్లో దుండగుడు కాల్పులు జరిపాడు. నంగ్లు ప్రాంతంలో ఒక మిఠాయిల దుకాణంలో కూడా ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు.