- రాణాకు 8 వికెట్లు lదక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు
చెన్నై: ఆఫ్స్పిన్నర్ స్నేహ్ రాణా (8/77) ఎనిమిది వికెట్లతో విజృంభించడంతో.. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు రసకందాయంలో పడింది. ఓవర్నైట్ స్కోరు 236/4తో మూడోరోజు ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా మరో 30 పరుగులు మాత్రమే జోడించి 266 వద్ద ఆలౌటైంది. రెండో రోజు మూడు వికెట్లతో రాణించిన స్నేహ్.. ఆదివారం మరో ఐదు వికెట్లు ఖాతాలో వేసుకొని సఫారీ జట్టు పతానాన్ని శాసించింది. దీంతో హర్మన్ప్రీత్ బృందానికి భారీ ఆదిక్యం దక్కడంతో ప్రత్యర్థిని మరోసారి బ్యాటింగ్కు (ఫాలోఆన్)కు ఆహ్వానించింది.
అయితే తొలి ఇన్నింగ్స్లో పేలవ ఆటతీరు కనబర్చిన దక్షిణాఫ్రికా అమ్మాయిలు.. రెండో ఇన్నింగ్స్లో మొండిగా పోరాడారు. ఆదివారం ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. సునె లుస్ (203 బంతుల్లో 109; 18 ఫోర్లు) సెంచరీతో ఆకట్టుకోగా.. కెప్టెన్ లార్ వాల్వర్ట్ (252 బంతుల్లో 93 నాటౌట్; 12 ఫోర్లు) క్రీజులో పాతుకుపోయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ, హర్మన్ప్రీత్ చెరో వికెట్ పడగొట్టారు. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా.. చేతిలో 8 వికెట్లు ఉన్న దక్షిణాఫ్రికా భారత స్కోరుకు ఇంకా 105 పరుగులు వెనుకబడి ఉంది.