30-03-2025 12:37:08 AM
ఏప్రిల్ 1 నుంచి రాత్రి 11: 45 గంటల వరకు సర్వీసులు
సోమవారం నుంచి శుక్రవారం వరకు అమలు
విద్యార్థుల మెట్రో ఆఫర్ మరో ఏడాది పొడిగింపు
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 29 (విజయ క్రాం తి): ఉగాది సందర్భంగా నగరవాసులకు మెట్రో అధికారులు తీపి కబురు చెప్పారు. ఇప్పటివరకు ఉన్న మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగించారు. ఏప్రిల్ 1 నుంచి రాత్రి 11: 45 గంటల వరకు మెట్రో సర్వీసులు నడవనున్నట్లు అధికారులు తెలిపారు.
సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని.. శని, ఆదివారాల్లో మా త్రం 11 గంటల వరకు నడుస్తాయని తెలిపారు. ప్రస్తుతం నగరంలోని మూడు (రెడ్, బ్లూ, గ్రీన్) కారిడార్లలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రైలు నడుస్తున్నాయి.
పెంచిన సమయం ప్రకారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11:45 గంట ల వరకు మెట్రో సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి ప్రతిరోజు దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రో లో పయనిస్తున్నట్టు అంచనా.
కాలేజీ విద్యార్థుల సౌకర్యార్థం 30 ట్రిప్పులు పొందే మెట్రో ఆఫర్ను వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్టు అధికారులు తెలిపారు. 2024 ఏప్రిల్లో ప్రారంభమైన సూపర్ సేవర్ హాలిడే ఆఫర్ (ఎస్ఎస్ఓ), ఆఫ్ పీక్ ఆఫర్ ఆదివారంతో ముగియనుందని తెలిపారు.
ప్రజా రవాణా వ్యవస్థ మరింత పటిష్టం
మెట్రోఫెస్ట్, మెట్రోమెడ్లీ, ఆర్ట్ ఫెస్ట్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయనున్నట్టు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ఈనెల 27 నుంచి 29 వరకు ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్లోని ప్రీమియా మాల్లో నిర్వహించిన మెట్రో ఆర్ట్ ఫెస్ట్ శనివారం ముగిసింది.
ఈ సందర్భంగా ఎల్ అండ్ టీ సంస్థ టీ- మొబైల్ అప్లికేషన్ యాప్ను సరికొత్త ఫీచర్లతో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ మెట్రో రైలు కేవలం మౌలిక సదుపాయాల ప్రాజెక్టు మాత్రమే కాదని, పట్టణ పరివర్తన, సమాజాభివృద్ధికి తోడ్పాటు అందిస్తోందని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.