17-04-2025 01:39:03 AM
98 వేలు దాటిన 10 గ్రాముల బంగారం ధర
అంతర్జాతీయంగా భారీ డిమాండ్
భారత్లో ఆల్టైం హైకి బంగారం ధర
అమెరికా వాణిజ్య యుద్ధమూ రేట్ల పెరుగుదలకు కారణమే..
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: బంగారం ధరలు ఆల్టైం గరిష్ఠానికి చేరుకున్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 98,100కు చేరుకుంది. ఒక్క రోజులోనే 10 గ్రాముల పుత్తడికి రూ. 1650 మేర పెరిగింది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పసిడికి రూ. 97,700 ధర పలికింది. వెండి ధరలకు కూడా రెక్కలొచ్చాయి. ఒక్క రోజులోనే కిలో వెండికి రూ. 1900 మేర పెరిగి.. రూ. 99,400కు చేరుకుంది. అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు పెరిగాయి. ప్రస్తుతం ఔన్సు బంగారానికి 3,296 డాలర్లుగా ఉంది.
అమెరికా సుంకాల విషయంలో ఎవ్వరూ తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. తద్వారా ఒకరిపై ఒకరు ఆంక్షలు విధించుకుంటున్నాయి. అంతే కాకుండా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందన్న ముందస్తు అంచనాలు కూడా బంగారం ధర పెరిగేందుకు ఒక కారణం అని అనలిస్టులు పేర్కొంటున్నారు. డాలర్ ఇండెక్స్ ఘోరంగా పతనం అయింది. బంగారం ధరకు రెక్కలు రావడానికి ఈ పతనం కూడా ఒక కారణమే.