calender_icon.png 22 October, 2024 | 5:32 AM

రూ.74,000పైకి బంగారం

17-07-2024 07:05:05 AM

  • ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై ఆశలు 
  • రికార్డుస్థాయికి సమీపంలో అంతర్జాతీయ ధర

హైదరాబాద్, జూలై 16: కొంతకాలంగా పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనవుతున్న బంగారం ధర తిరిగి కొత్త రికార్డును అందుకునేదిశగా పయనిస్తున్నది. తాజాగా తులం ధర రూ.74,000 స్థాయిని అధిగమి ంచింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న బుల్లిష్ ట్రెండ్ కారణంగా స్థానికంగా ధర పెరుగుతున్నదని బులియన్ వర్తకులు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ.380 పెరి గి రూ. 74,020 వద్దకు చేరింది. గురువారం  22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 350 పెరిగి రూ. 67,850 వద్ద నిలిచింది. మే 20న పూర్తి స్వచ్ఛతకలిగిన బంగారం ధర రూ. 75,160 రికార్డుస్థాయికి చేరిన తర్వాత ఇది తగ్గి రూ.71,500 స్థాయికి దిగింది.

గత మూడు వారాలుగా పెరుగుతూ వస్తున్నది. తాజాగా  యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది వడ్డీ రేట్లు త్వరలో తగ్గించవచ్చన్న అంచనాలు ఏర్పడటంతో ప్రపంచ మార్కె ట్లో మంగళవారం  ఔన్సు పుత్తడి ధర 39  డాలర్లకు పెరిగి 2,461 డాలర్ల స్థాయికి చేరింది. అంతర్జాతీయంగా కూడా మేలో నెలకొల్పిన 2,468 రికార్డు ధరకు సమీపానికి చేరుతున్నది. ఈ నేపథ్యం లో దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో (ఎంసీఎక్స్) పూర్తి స్వచ్ఛతగల 10 గ్రాముల పుత్తడి ధర రూ.74,110 స్థాయికి చేరింది. 

ఈటీఎఫ్‌ల డిమాండ్

ప్రపంచ మార్కెట్లలో రికార్డు గరిష్ఠస్థాయి సమీపానికి చేరిన దృష్ట్యా ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) డిమాండ్‌తో పాటు స్పెక్యులేటివ్ కొనుగోళ్లతో  దేశీయ మార్కె ట్లో బంగారం పుంజుకుంటున్నదని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ చెప్పారు. యూఎస్ డాలర్ ఇండెక్స్, ట్రెజరీ ఈల్డ్స్ తగ్గుదల బంగారం ధరకు మద్దతును ఇస్తున్నాయన్నారు. అమెరికా, ఫ్రాన్స్‌ల్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితితో బులియన్ మార్కెట్లో కొనుగోళ్లు జరుగుతున్నట్టు జేఎం ఫైనాన్షియల్, బ్లింక్‌ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మీర్ చెప్పారు.