హనుమాన్ ఆలయంలో జెండాను ఆవిష్కరించిన శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి
సిమ్లా, అక్టోబర్ 24: గోమాతను రాష్ట్రమాతగా ప్రకటించాలని జ్యోతిర్మఠ్ పీఠాధి పతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి చేపట్టిన గోధ్వజ్ స్థాపన భారత్ యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. జమ్ములో గోధ్వజ్ స్థాపన అనంతరం హిమాచల్ప్రదేశ్ రాజధాని సిమ్లాకు స్వామీజీ చేరుకున్నారు.
గురువారం సిమ్లాలోని జాఖు హనుమాన్ మందిర్లో గోప్రతిష్ఠ ధ్వజాన్ని శంకరాచార్య స్వామీజీ ఆవిష్కరించారు. అనంతరం రామాలయంలో జరిగిన కార్యక్రమంలో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. గోమాత ప్రాముఖ్యాన్ని భక్తులకు వివరించారు. అంతకుముందు సిమ్లా ఎయిర్పోర్టుకు చేరుకున్న స్వామీజీకి భక్తులు ఘనస్వాగతం పలికారు.
పాదుక పూజ నిర్వహించారు. గోధ్వజ్ స్థాపన భారత్ యాత్రలో మొత్తం 36 రాజధాని నగరాల్లో శంకరాచార్య స్వామీజీ పర్యటిస్తున్నారు. గోమాతను రాజ్యమాతగా ప్రకటించాలనే డిమాండ్తో ఈ యాత్రను చేపట్టారు.అయోధ్య నుంచి సెప్టెంబర్ 22న ప్రారంభమైన యాత్ర అక్టోబర్ 26న ఢిల్లీలో ముగుస్తుంది. ఆ రోజు గోవును రాజ్యమాతగా ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తామని స్వామీజీ ఇప్పటికే ప్రకటించారు.