ఆవిష్కరించనున్న జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి
సిమ్లా, అక్టోబర్ 23: జ్యోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి చేపట్టిన గోధ్వజ్ స్థాపన భారత్ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల రాజధాని నగరాల్లో గోప్రతిష్ఠ ధ్వజాన్ని స్వామీజీ స్థాపించారు. స్వామీజీ వెళ్లని ప్రాంతాల్లోనూ ఆయన భక్తులు ధ్వజాన్ని ప్రతిష్ఠించారు.
మంగళవారం జమ్ములో గోధ్వజాన్ని స్థాపించిన స్వామీజీ బుధవారం హిమాచల్ప్రదేశ్ రాజధాని సిమ్లాకు చేరుకున్నారు. యాత్రలో భాగంగా దాదాపు 11 గంటలు నిరంతరాయంగా స్వామీజీ ప్రయాణించారు. సిమ్లాలో భక్తుల నుంచి పాదుక పూజను స్వీకరించారు. గురువారం సిమ్లాలోని జఖు ఆంజనేయస్వామి ఆలయంలో గోప్రతిష్ఠ ధ్వజాన్ని శంకరాచార్య స్వామీజీ స్థాపన చేస్తారు.
అనంతరం రామమందిరంలో జరిగే కార్యక్రమంలో భక్తులను ఉద్దేశించి మాట్లాడుతారు. గోధ్వజ్ స్థాపన భారత్ యాత్రలో భాగంగా మొత్తం ౩౬ రాజధాని నగరాల్లో శంకరాచార్య స్వామీజీ పర్యటిస్తున్నారు. గోమాతను రాజ్యమాతగా ప్రకటించాలనే డిమాండ్తో ఈ యాత్రను చేపట్టారు.