20-03-2025 12:00:00 AM
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య.
ముషీరాబాద్, మార్చి 19: (విజయక్రాంతి): అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి పార్లమెం ట్లో బిల్లు సాధించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ మీడియా పాయింట్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ బీసీ రిజర్వేషన్లో స్థానిక సంస్థల్లో బి.సి.లకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లలో 42 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞత లు తెలిపారు.
బీసీల సమిష్టి పోరాట కృషి ఫలితమని అన్నారు.. అలాగే ఈ బిసి బిల్లు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రవేశపెట్టి దీన్ని షెడ్యూల్ 9 లో పొందుపరిస్తే తప్ప న్యాయపరమైన ఇబ్బందులు కాకుండా ఉంటుందన్నారు. నిజంగా చిత్తశుద్ధి కలిగితే రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా కూర్చొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యేంత వరకు ఇక్కడి నుంచి తెలంగాణ పరిపాలన మొదలు పెట్టాలని అన్నారు.
దీనికి ఉదాహరణగా జయలలిత గతంలో తమిళనాడు లో బీసీల కొరకు తమిళనాడు నుండి అఖిలపక్షాన్ని తీసుకొని వచ్చి ఢిల్లీలోనే ఉండి ఇక్కడ బిల్లు పాస్ అయ్యేంతవరకు తమిళనాడు బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యేంతవరకు ఇక్కడే ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు.
అలాగే ప్రభుత్వం గచ్చిబౌలి, ఇతర స్థలలో ప్రభుత్వ భూములు వేలం వేసి అమ్మాలని చూస్తుందని, దీనిని గట్టిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇట్టి స్థలాలు హాస్టళ్ళు, గురుకులాలు భవనాలు కట్టడానికి వినియోగించాలని, హాస్టళ్ళ అద్దె బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ, జెల్ల నరేందర్, వెంకట రామయ్య, స్వరూప, పరశురామ్, విజయలక్ష్మి, బాగ్య లక్ష్మి పాల్గొన్నారు.