22-02-2025 05:03:35 PM
మణుగూరు,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసి గిరిజన ప్రాంతాల్లో జీవో నెంబర్.3ను పునరుద్ధరించి వంద శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆదివాసీ సంఘాల నేతలు(Tribal Communities Leaders) డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్, తార్నాక నందు ఎమ్మెల్సీ ప్రో.కోదండరాం(MLC Prof. Kodandaram)ను ఆదివాసి సమస్యలు, డిమాండ్లపై ఆదివాసీ ఐకాస రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ, తుడుందేబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అలెం కోటి, ఎన్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉషాకిరణ్ ఏజెన్సీ ప్రాంత ఆదివాసుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. జీవో.నం.3 ను సుప్రీంకోర్టు కొట్టేయడం వల్ల గత 5 ఏండ్ల నుండి ఏజెన్సీలో ఆదివాసిలు అనేకం ఉద్యోగాలు కోల్పోయారని, తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం వంద శాతం రిజర్వేషన్ పై ఆర్డినెన్సు ఇచ్చే విధంగా కృషి చేయాలని కోదండరాం ను కోరారు. పెండింగులో ఉన్న పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని, వివాదంలో ఉన్న ఏజెన్సీ మణుగూరు, పాల్వంచ, మంద మర్రి గ్రామాలకు గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించే లా చర్యలు తీసుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఇసుక పాలసీలో పీసా చట్టం ప్రకారం ఆదివాసీలకే కల్పించాలని, మణుగూరు బీటిపిస్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని, ఐటీడీఏలకు పాలక మండలి సమావేశాలు నిర్వహించాలని, నల్లమల అటవీ ప్రాంతం చెంచు పెంటి గూడేల అబివృద్దికి ప్రత్యేక నిధులు కేటాయించాలన్న తదితర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. ప్రో.కోదండరాం సానుకూలంగా స్పందిస్తూ.. మార్చి మొదటి వారంలో రాష్ట్రం లోని అన్ని ఆదివాసి సంఘాల ప్రతినిధులతో సెమినార్లు, చర్చలు జరిపి గవర్నర్, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లి న్యాయం చేస్తానని హామీని ఇచ్చారు.