05-03-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, మార్చి 4: కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25శాతం సుంకాలను విధించడంతోపాటు చైనాపై విధిస్తున్న సుంకాన్ని 20శాతానికి పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలపై కెనడా, చైనాలు స్పందిస్తూ.. అమెరికాకు సంబంధించిన కొన్ని ఉత్పత్తులపై సైతం అదనపు సుంకాలు విధించనున్నట్టు ప్రకటించాయి.
దేశాల మధ్య సరస్పర సుంకాల విధింపు వాణిజ్య యుద్ధానికి ఆజ్యంగా మారడంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. సోమవారం నాటి ట్రేడింగ్లో అమెరికా సూచీలు పతనమయ్యాయి. డోజోన్స్ 1.48శాతం, ఎస్అండీపీ సూచీ 1.76శాతం, నాస్డాక్ 2.64శాతం పడిపోయాయి.
ఆసియా, ఆస్ట్రేలియా మార్కెట్లలో కూడా వాణిజ్య భయాలు కనిపిండంతో టోక్యో, హాంగ్కాంగ్, సిడ్నీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ది బెంచ్మార్క్ నిక్కీ 225 ఇండెక్స్ 2.43శాతం క్షీణించగా.. టాపిక్స్ ఇండెక్స్ 1.48శాతం నష్టపోయింది. ప్రపంచ వ్యాప్తంగా 13 ప్రధాన రంగాలు ప్రారంభంలో నష్టాలను చవి చూశాయి.
ది ఎమ్ఎస్సీఐ ఆసియా 0.6శాతం పడిపోయింది. మెక్సికోలో పెద్ద మొత్తంలో ట్రక్కులను ఉత్పత్తి చేస్తున్న జనరల్ మోటర్స్ షేర్లు 4శాతం పడిపోయాయి. ఫోర్డ్ కంపెనీ షేర్లు 1.7శాతం నష్టపోయాయి. మరికొన్ని రోజుల్లో వినియోగదారులపై అధిక ధరల భారం పడనుందని కార్నెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గుస్తావో ఫ్లోరెస్ మాకియాస్ అభిప్రాయపడ్డారు.