calender_icon.png 17 October, 2024 | 6:58 PM

వ్యాధులను నిరోధించే లక్ష్యంతో గ్లోబల్ హెల్త్ సమ్మిట్

17-10-2024 04:54:44 PM

ముషీరాబాద్ (విజయక్రాంతి): దేశంలో క్యాన్సర్ వ్యాప్తిని, గుండెపోటు వ్యాధులను తగ్గించే లక్ష్యంగా 18వ గ్లోబల్ హెల్త్ సమ్మిట్ న్యూఢిల్లీలో ఈనెల 18, 19, 20 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఆపి(అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్) అధ్యక్షులు డాక్టర్ సతీష్ కత్తుల వెల్లడించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న గ్లోబల్ హెల్త్ సమ్మిట్ కు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ప్రపంచ వ్యాప్తంగా వివిధ వైద్య విభాగాల్లో నిష్ణాతులైన భారతీయ వైద్య నిపుణులు, వైద్య పరిశోధకులు, వందలాది మంది వైద్యవిద్యార్థులు హాజరవుతున్నట్లు చెప్పారు.

ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 18 వ గ్లోబల్ హెల్త్ సమ్మిట్లో అకడమిక్ సెషన్స్ ను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సెషన్స్ లో వైద్య నిపుణులు, పరిశోధకుల తోపాటు పాలసీ మేకర్స్ అందరూ హాజరవుతున్నారని వెల్లడించారు. ప్రధానంగా అనేక మంది పరిశోధకులు దేశంలో క్యాన్సర్, గుండెపోటు జబ్బులపై జన్యుపరమైన అంశాలు, వాతావరణ పరిస్థితులు ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయన్న విషయమై తమ పరిశోధనా పత్రాలను సమర్పిస్తారని తెలిపారు.