03-03-2025 12:48:57 AM
న్యూఢిల్లీ, మార్చి 2: అమెరికా ప్రైవేటు సంస్థ ఫైర్ఫ్లే ఎయిరోస్పేస్ అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా) సహకారంతో ప్రయోగిం చిన బ్లూ ఘోస్ట్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై ఆదివారం విజయవంతంగా దిగింది. చంద్రుడి ఈశాన్య భాగంలో ఉన్న పురాతన అగ్నిపర్వత ప్రదేశం మోన్స్ లాట్రెయిల్ ప్రాంతంలో జాబిల్లి ఉపరితలాన్ని బ్లూ ఘో స్ట్ తాకింది.
దీంతో చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ను విజయవంతంగా దించిన తొలి ప్రైవేటు సంస్థగా ఫైర్ఫ్లే ఎయిరోస్పేస్ నిలిచింది. ఈ విషయాన్ని సదరు సంస్థ కూడా ఎక్స్ వేదికగా ప్రకటించింది. ల్యాండర్ను విజయవంతంగా చంద్రుడిపై దించిన తొలి వాణిజ్య సంస్థగా చరిత్ర సృష్టించినట్టు ఫైర్ప్లే తన పోస్ట్లో పేర్కొంది.
బ్లూ ఘోస్ట్ ఏం చేస్తుంది?
భూమిపై నుంచి కూడా కనిపించే భారీ బిలం సీ ఆఫ్ క్రైసెస్ను అన్వేషించాలనే ప్రధాన లక్ష్యంతో ఫైర్ఫ్లే సంస్థ ఈ ప్రయోగాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఆ భారీ బిలం ఉన్న ప్రదేశంలోనే ల్యాండర్ను దించింది. సంపూర్ణ చంద్రగ్రహణానికి సం బంధించిన అత్యంత స్పష్టమైన ఫొటోలను బ్లూ ఘోస్ట్ తన కెమెరాతో బంధించి శాస్త్రవేత్తలకు పంపనుంది.
అలాగే ఈ నెల 16న జాబిల్లిపై సూర్యాస్తమయం అవుతుంది. ఆ సమయంలో చంద్రుడిపై చోటుచేసుకొనే వాతావరణ మార్పులను ఫొటోలు తీస్తుంది. ఈ ఫొటోలతో సౌర ప్రభావం వల్ల చంద్రుడిపై పైకి లేచిన ధూళి ఎలా కాంతిని వెదజల్లుతుందనే విషయాన్ని విశ్లేషించడానికి వీలవుతుంది. అలాగే జాబిల్లి అంతర్భాగంలో గల ఉష్ణప్రవాహాన్ని స్టడీ చేస్తుంది. ఇది చండ్రుడిపై ఉష్ణ పరిమాణాన్ని అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తలకు సహాయపడుతుంది.
జనవరి 15న నింగిలోకి
ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి జనవరి 15న స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ రాకెట్.. బ్లూ ఘోస్ట్తోపాటు జపాన్కు చెందిన మరో ల్యాండర్ ‘హకుటోెేఆర్2’ను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. నాసాకు సంబంధించిన 10 పేలోడ్లు కూడా బ్లూ ఘెస్ట్లో ల్యాండర్లో ఉన్నాయి. కాగా మార్చి 16న చండ్రుడిపై సూర్యాస్తమయం అవుతుండటంతో దాదాపు 14 రోజులపాటు బ్లూ ఘోస్ట్ ల్యాండర్ తన సేవలను అందించనుంది. బ్లూ ఘోస్ట్ ల్యాండ్ అవుతూనే చంద్రుడి ఉపరితలానికి సంబంధించి ఫొటోను తీసి భూమిపైకి పంపించింది.