మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయడమే లక్ష్యం
హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు
అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్-2024లో మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని జీహెచ్ఎంసీని నాలుగు కార్పొరేషన్లుగా విభజించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తు న్నట్లు ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు.
హెచ్ఐసీసీ, నోవాటెల్లో అసోచామ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్--2024కు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళన పేరిట జైకా నుంచి రూ.వెయ్యి కోట్లు రుణం తీసుకున్న బీఆర్ఎస్ నాయకులు.. అధికారం పోగానే మూసీ ప్రక్షాళన వద్దని గగ్గోలు పెడుతున్నారని ఆరోపించారు.
మూసీ పరివా హక ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. రాజకీయాలు చేయడం తగదని ప్రతిపక్షాలకు సూచించారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల బృందమంతా కలిసి మౌలిక సదుపాయాల కల్పన కోసం స్పీడ్ (స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫీషియంట్, ఎఫెక్టివ్ డెలివరీ) వంటి ప్రణాళికలతో 19 ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తిచేసేందుకు ముందుకు సాగుతు న్నట్లు తెలిపారు.
అందులో భాగంగానే ముసీ రివర్ఫ్రంట్ అభివృద్ధి, కొత్త విమానాశ్రయాల నిర్మాణం, శాటిలైట్ టౌన్స్ ఏర్పాటు, మెట్రో విస్తరణ, జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణ, సికింద్రాబాద్, ఇతర నగరాల్లో ఎలివేటెడ్ కారిడార్లు, రీజినల్ రింగ్ రోడ్, హైకోర్ట్ భవన నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్, ఉస్మానియా నూతన భవన నిర్మాణం వంటి ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. హైకోర్టు భవనంలో పీపీపీ మోడల్లో పార్కింగ్ నిర్మించే అంశంపై ఆలోచన చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
హైదరాబాద్ అభివృద్ధి కోసం..
హైదరాబాద్ అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయించిందని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ను తీర్చిది ద్దేందుకు ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. రాష్ర్టంలో పర్యావరణ సుస్థిరతను మెరుగుపరచడమే లక్ష్యంగా.. తమ ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్తో కలిసి నెట్ జీరో ఎమిషన్స్ లక్ష్యంగా కృషిచేస్తున్నట్లు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న అర్బన్ కల్చర్కు అనుగుణంగా తెలంగాణలోనూ పట్టణీకరణ జర గాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశంలో పరిమి తమైన ప్రాంతంలో అపరిమితమైన ఫ్లోర్ స్పేస్ అందించే ఏకైక రాష్ర్టం తెలంగాణ మాత్రమేనన్నారు.
కార్యక్రమం లో అమెరికన్ కాన్సుల్ జనరల్ (చీఫ్ పొలిటికల్ అండ్ ఎకానమిక్ సెక్షన్) ఫ్రాంక్ పి టల్లూటో, ఫీనిక్స్ గ్రూప్ చైర్మన్ సురేశ్ చుక్కపల్లి, అలార్డ్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ పూనమ్ కశ్యప్, రాంబాబు బూరుగు, అసోచామ్ రాష్ర్ట ప్రతినిధి దినేశ్ పాల్గొన్నారు.