01-03-2025 01:00:41 AM
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి కాస్త నెమ్మదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) మూడో త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 6.2 శాతంగా నమోదైనట్లు కేంద్ర గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) శుక్రవారం తెలిపింది. తయారీ, మైనింగ్ రంగాల్లో పేలవమైన పనితీరు కారణంగా వృద్ధి క్షీణించిందని పేర్కొంది. గతేడాది ఇదే సమయంలో జీడీపీ 9.5 శాతంగా నమోదైంది.
జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదైన ఆర్థిక వృద్ధి 5.6 శాతంతో పోలిస్తే క్యూ3లో పెరగడం గమనార్హం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ 6.4 శాతం వృద్ధి నమోదవుతుందని జనవరిలో వెలువరించిన అంచనాల్లో పేర్కొంది. అలాగే, 2023-24 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 8.2 శాతం నుంచి 9.2 శాతానికి సవరించింది.