13-04-2025 01:00:38 AM
*తమిళనాడు ప్రభుత్వం చారిత్రక నిర్ణయం
చెన్నై, ఏప్రిల్ 12: తమిళనాడు ప్రభుత్వం శనివారం గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం లేకుండానే 10 చట్టాలను గెజిట్లో నోటిఫై చేసింది. రాజ్యాంగ చరిత్రలో ఒక రాష్ట్రం ఇలా చేయడం ఇదే తొలిసారి. పెండింగ్ బిల్లుల విషయమై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తమిళనాడు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ ఎలాంటి సమాధానం ఇ వ్వకపోవడంతో 2023లోనే తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తాజాగా ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర గవర్నర్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం స్పష్టం చేసింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆ మోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే అందు కు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు నెల మాత్రమేనని తీర్పులో పేర్కొంది. గవర్నర్ ఈ కాల నిర్దేశాన్ని పాటించని పక్షంలో ఆయన చర్యపై కోర్టులు న్యాయసమీక్ష జరపవచ్చని వెల్లడించింది.
బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయానికి మూడు నెలల గడువు
రాష్ట్ర గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతికి నిర్దిష్ట గడువు విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని అ త్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.