calender_icon.png 27 September, 2024 | 4:56 PM

క్వార్టర్స్‌లో గాయత్రి జోడీ

27-09-2024 12:00:00 AM

సింగిల్స్‌లో శ్రీకాంత్ కూడా

మకావు ఓపెన్

దుబాయ్: మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్‌లో తెలుగుతేజం కిడాంబి శ్రీకాంత్.. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపిచంద్-త్రిసా జాలీ జంట క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. గురువారం జరిగిన మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి ద్వయం 22-20, 21-11తో లిన్ చిహ్-చున్ తెంగ్ (చైనీస్ తైపీ) జంటపై విజయం సాధించింది. కేవలం 30 నిమిషాల్లోనే ప్రత్యర్థిని మట్టికరిపించడం విశేషం. నేడు జరగ నున్న క్వార్టర్స్‌లో గాయత్రి జోడీ కొరియాకు చెందిన సు-లిన్  జంటను ఎదుర్కోనుంది.

ఇక పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో కిడాంబి శ్రీకాంత్ రెండో రౌండ్‌లోనూ విజయం సాధించాడు. శ్రీకాంత్ 21-13, 21-18తో సహచర షట్లర్ ఆయుశ్ శెట్టిపై గెలుపొంది క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. క్వార్టర్స్‌లో శ్రీకాంత్ హాంగ్ కాంగ్‌కు చెందిన లాంగ్ అంగస్‌తో తలపడనున్నాడు. మిగిలిన మ్యాచ్‌ల్లో మహిళల సింగిల్స్‌లో తన్సిమ్ మిర్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో హైదరాబాదీ ద్వయం సుమిత్-సిక్కిరెడ్డి ప్రి క్వార్టర్స్‌లో ఇంటిబాట పట్టారు.