calender_icon.png 27 October, 2024 | 9:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్విచక్రవాహన దొంగల ముఠా అరెస్ట్

12-08-2024 12:21:05 AM

కూకట్‌పల్లి,  ఆగస్టు 11:  ఇళ్ల ముందు పార్కు చేసిన ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.  అల్లాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నానక్‌రామ్‌గూడకు చెందిన చప్పిడి గణేష్, బాచుపల్లికి చెందిన గుబ్బల పవన్ కుమార్, మోతీనగర్‌కు చెందిన గుబ్బల శ్రీరామ్‌తో పాటు మరో మైనర్ బాలుడు జల్సాలకు అలవాటు పడ్డారు. జల్సాలకు డబ్బు సమకూర్చుకునేందుకు నలుగురు ముఠాగా ఏర్పడ్డారు. ఈ క్రమంలో ఇండ్ల ముందు, రోడ్ల పక్కన పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను అపహరించడం ప్రారంభించారు. ఆ వాహనాలను తక్కువ ధరకు అమ్మి వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు.

శనివారం గాయత్రీ నగర్ చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపడుతుండగా.. రెండు ద్విచక్ర వాహనాలపై నలుగురు యువకులు అటుగా వచ్చారు. పోలీసులు ద్విచక్ర వాహనాలను అడ్డుకుని వాహనాలకు సంబంధించిన పత్రాలు చూపించాలన్నారు. యువకులు అనుమానాస్పదంగా ప్రవర్తించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారు వాహన దొంగలు అని తేలింది. అనంతరం నిందితుల నుంచి సుమారు రూ.15 లక్షలు  విలువ చేసే 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. మరో మైనర్ జువైనల్‌కు పంపించారు.